వరద నుంచి బయటపడేందుకు కరెంట్‌పోల్‌ను పట్టుకున్న వ్యక్తి.. కానీ..

తెలంగాణలో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on  8 May 2024 4:59 AM GMT
hyderabad, man, dead, ater touching current poll,

 వరద నుంచి బయటపడేందుకు కరెంట్‌పోల్‌ను పట్టుకున్న వ్యక్తి.. కానీ.. 

తెలంగాణలో మంగళవారం వర్షం బీభత్సం సృష్టించింది. ఉన్నట్లుండి కురిసిన అకాల వర్షంతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పాతబస్తిలో కూడా ఓ యువకుడు మంగళవారం సాయంత్రం బయటకు వచ్చాడు. అయితే.. ఉన్నట్లుండి వర్షం భారీగా పడటంతో రోడ్లపై వరద ప్రవహించింది. ఆ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కిందపోయేంత పని అయ్యింది. దాంతో.. తప్పించుకునేందుకు అతను రోడ్డుపక్కనే ఉన్న కరెంట్‌ పోల్‌ను పట్టుకున్నాడు. అంతే.. విద్యుత్‌షాక్‌ కొట్టింది. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్‌ పాతబస్తీలో బహదూర్పురాలో చోటుచేసుకుంది ఈ విషాదకర సంఘటన. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరద వచ్చింది. దాదాపు మొకాళ్ల కింద వరకు వరద వచ్చింది. అయినా కూడా ఇళ్లకు చేరుకోవాలని అనుకున్న వారు వాహనాల్లో రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు బహదూర్‌పురాలో వరద ఎక్కువగా ఉన్న రోడ్డును క్రాస్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ చివర నుంచి ఈ చివర వరకు కాస్త కష్టంగానే వచ్చాడు. అయితే.. చివరి అడుగు సరిగ్గా పడకపోవడంతో అతను కిందపడిపోయేంత పని అయ్యింది. దాంతో.. అతను కిందపడిపోకుండా ఉండేందుకు కరెంట్‌ పోల్‌ను పట్టుకున్నాడు.

ఇదే అతను చేసిన తప్పుగా మిగిలిపోయింది. మృత్యువు అతన్ని వెంటాడింది. ఆ కరెంట్‌ పోల్‌ను పట్టుకోవడం ద్వారా విద్యుత్‌షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story